అమరావతి : ఏపీలోని పర్యాటక కేంద్రాలు, ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. ఐదు సర్క్యూట్లలో ఈ టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సచివాలయంలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజాతో కలిసి దేవాదాయశాఖ, పర్యాటకశాఖల అధికారులతో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం మంత్రులు ఇద్దరూ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పలు ఆలయాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఆకట్టుకునేలా రెండు శాఖలు చర్యలు తీసుకుంటున్నాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. మొత్తం 16 సర్క్యూట్లకు సంబంధించి ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. విజయవాడ-పంచారామ యాత్ర, విజయవాడ-అష్టశక్తి యాత్ర, విజయవాడ-త్రిలింగ యాత్ర, తిరుపతి-కృష్ణదేవరాయ యాత్ర, తిరుపతి-గోల్డెన్ ట్రయాంగిల్ యాత్రలకు అత్యధిక రేటింగ్స్ లభించాయని చెప్పారు. ఈ ఐదు సర్క్యూట్లలో మొదటి దశలో టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఇందులో భాగంగా టెంపుల్ టూరిజం సర్క్యూట్లను ముందుగా తీసుకున్నట్లు చెప్పారు. యాత్రికులు ఈ ప్రాంతంలోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను ఒకేసారి సందర్శించే వీలు ఈ టెంపుల్ టూరిజంలో ఉంటుందిన మంత్రి రోజా తెలిపారు. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని సర్క్యూట్లలో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.