శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రానికి వచ్చే భక్తులు తమ ముడుపులు, కానుకలను హుండీల్లోనే సమర్పించాలని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న సూచించారు. హుండీల్లో కాకుండా వ్యక్తుల చేతులకు ఇస్తే అది అపాత్రదానంగా మారుతుందన్నారు. ప్రతి నిత్యం వేలాదిగా వచ్చే యాత్రికుల కావాల్సిన ఆర్జిత సేవా టిక్కెట్లతోపాటు వివిధ అవసరాలను ఆసరాగా తీసుకుని సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్న దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి వచ్చే భక్తుల మనోభావాలు, విశ్వాసాలను సొమ్ము చేసుకునేందుకు యత్నించడం క్షమించరాని నేరమన్నారు. స్వామిఅమ్మవార్ల సామూహిక అభిషేకం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, నిత్యకళ్యాణం, హోమాలు తదితర ఆర్జిత సేవా టిక్కెట్లను దేవస్థానం కౌంటర్ వద్ద మాత్రమే తీసుకోవాలని, ప్రధాన ఆలయ ప్రాంగణంలో కూడా నూతనంగా ఆర్జిత సేవా టిక్కెట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు.
ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, అన్నదాన భవనం, ప్రసాద విక్రయ కేంద్రాలు, వసతి విభాగం, కేశఖండనశాలకు వచ్చే వారి నుంచి కానుకలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లయితే క్రమశిక్షణా చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామని అధిక ధరలు వసూలు చేసే వారి గురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి వచ్చే భక్తులు ముందస్తుగా వసతి గదులను ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు 8333901351- 6 కాల్ సెంటర్లో సంప్రదించాలని సూచించారు.