అమరావతి : విధుల నిర్వహణను సక్రమంగా నిర్వర్తించకుండా, కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించిన ఓ తహసీల్దార్కు హైకోర్టుకు ఆరునెలల జైలు శిక్ష విధించింది. కర్నూలు జిల్లాలోని సి బెళగల్ ఎమ్మార్వోగా జె. శివశంకర నాయక్ పనిచేస్తున్నారు. సి.బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన పింజరి కరీం సాబ్అనే రైతు అదే మండల పరిధిలోని కొత్తకోట గ్రామం సరిహద్దులో సర్వే నెం. 430/ 1లో 11 ఎకరాల 73 సెంట్ల తన సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన భూమి మ్యుటేషన్ చేయాలని స్థానిక ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే ఎమ్మార్వో శివశంకర నాయక్ గ్రామ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి బాధితుడు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది చల్లా శివశంకర్ ద్వారా బాధితుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు రైతు భూమిని మ్యుటేషన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఎమ్మార్వో ఈ ఉత్తర్వులను పట్టించుకోక పోవడంతో ఎమ్మార్వో శివశంకర్కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తు తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశాలు జారీ చేసింది.