AP News | స్కూల్ వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని ఓ టీచర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీలోని విజయవాడలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని మొగల్రాజపురం బీఎస్ఆర్కే ఉన్నత పాఠశాలలో ఎ.రమేశ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఆయన స్కూల్ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన మెసేజ్లను పట్టించుకోవడం లేదు. వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా అకస్మాత్తుగా వెళ్లిపోయాడు. దీని గురించి అడిగినప్పటికీ సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో రమేశ్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తనకు కంటి సంబంధిత సమస్య ఉందని.. స్మార్ట్ఫోన్ వాడొద్దని వైద్యులు చెప్పారని రమేశ్ వివరణ ఇచ్చినప్పటికీ.. పర్సనల్ విషయాన్ని సాకుగా చూపించి సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నించారు. దీనిపై యూటీఎఫ్ అధ్యర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ సహాయ సంచాలకులు రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు.
కాగా, ఈ వివాదంపై డీఈవో యూవీ సుబ్బారావు స్పందించారు. కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని రమేశ్ను అడిగామని.. అయినా ఆయన స్పందించలేదని తెలిపారు. అంతేకాకుండా విధి నిర్వహణలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అందువల్లే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని వివరించారు.