అమరావతి : రాజకీయంగా, ఆర్థికంగా అడ్డువస్తున్నాడనే కక్షతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ( Teacher ) ఏగిరెడ్డి కృష్ణను ప్రత్యర్థులు దారుణంగా చంపారని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక (Superintedent Of Police ) ఆదివారం వెల్లడించారు. గ్రామంలో ఆదిపత్యపోరు కూడా మరో కారణమని ఆమె స్పష్టం చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకటనాయుడుతో పాటు రామస్వామి, గణపతి, మోహన్ను అరెస్టు (Arrest ) చేసినట్లు వివరించారు. హత్యకు ముందు రెక్కీ(Recky) నిర్వహించారని ఆమె తెలిపారు.
శనివారం ఉదయం ఉపాధ్యాయుడు కృష్ణ బైక్పై పాఠశాలకు వెళ్తుండగా వెంటపడి బొలెరో వాహనంతో ఢీ కొట్టారు. అనంతరం రాడ్తో దారుణంగా కొట్టి చంపివేశారని ఎస్పీ పేర్కొన్నారు. గతంలో వెంకటనాయుడు కుటుంబీకులు సుమారు రూ.2 కోట్లు అప్పు చేసి తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామంలో ప్రభుత్వ నిర్మాణాల పనులు చేపట్టారు. దీనికి సంబంధించిన బిల్లులు అవ్వకుండా ఉపాధ్యాయుడు కృష్ణ అడ్డుపడడంతో అతడిపై కక్ష పెంచుకుని హత్య చేశారని ఆమె వెల్లడించారు.
టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కృష్ణ 1988 నుంచి 1995 వరకు సర్పంచ్గా పనిచేశారు. అనంతరం 1998లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఈయన ఎవరికి మద్దతు తెలిపితే వారే సర్పంచిగా గెలిచేవారు. 2021 నుంచి కృష్ణ వైసీపీకి మద్దతుదారుడిగా పనిచేస్తు వస్తున్నారు. అప్పటికే వైసీపీలో ఉన్న వెంకటనాయుడు కృష్ణ రాకతో తనకు రాజకీయ ఎదుగదలకు ఆటంకం ఏర్పడే అవకాశముందన్న కక్ష పెంచుకుని ఈ హత్యకు పాల్పడ్డాడని ఎస్పీ వెల్లడించారు.