చిత్తూరు : జ్వరం వచ్చిన ఓ విద్యార్థి తరగతి గదిలోనే పడుకున్నాడని కోపంగించిన ఓ అధ్యాపకుడు.. సదరు విద్యార్థిని కొట్టాడు. దాంతో విద్యార్థి తల డెస్క్కు తగిలి అపస్మారకంలోకి వెళ్లిపోయాడు. విద్యార్థి కుటుంబీకులు, బంధువులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగడంతో.. వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పరిధిలోని జరావారిపల్లెకు చెందిన రోహిత్ అనే విద్యార్థి కుప్పం వెళ్లే దారిలో ఉన్న ఓ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నాడు. వారం క్రితం జ్వరంగా ఉండటంతో క్లాస్ రూంలోని వెనక బెంచీపై పడుకున్నాడు. మ్యాథ్స్ టీచర్ జ్యోతీశ్వర్ క్లాసులోకి వచ్చి రోహిత్ పడుకున్నది గమనించి పిలిచాడు. జ్వరంగా ఉన్నదని చెప్పగా.. అబద్ధం చెప్తున్నావంటూ కర్రతో కొట్టాడు. తలను డెస్క్కేసి కొట్టాడు.
స్కూల్ నుంచి ఇంటికెళ్లాక మంచంలో పడుకుని పోయాడు. జ్వరం ఎంతకూ తక్కువ కాకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక క్లినిక్లో వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు స్విమ్స్కు తీసుకెళ్లాలని సూచించడంతో స్విమ్స్కు తరలించగా చికిత్స అందిస్తున్నారు. అయితే, పది రోజులు గడుస్తున్నా రోహిత్ కోలుకోవడం లేదు. కోమాలోనే ఇంకా ఉండటంతో కుటుంబీకులు, బంధువులు రోహిత్ చదివే స్కూల్పై దాడికి దిగారు. చిన్నారి వైద్యానికయ్యే ఖర్చును తాము భరిస్తామని పాఠశాల యాజమాన్యం సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. విద్యార్థిని కొట్టిన టీచర్ను పాఠశాల విధుల నుంచి సస్పెండ్ చేశారు.