హైదరాబాద్: తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన పులివెందుల (Pulivendula) జడ్పీటీఎసీ ఉపఎన్నికలో (ZPTC By Election) విపక్ష వైసీపీకి (YCP) ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న పులివెందులలో 30 ఏండ్ల తర్వాత అధికార టీడీపీ (TDP) జెండా ఎగురవేసింది. ఘర్షణలు, పోలీసుల పహారా మధ్య సాగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిపై 6వేల 52 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6735 ఓట్లు రాగా, వైసీపీ క్యాండిడేట్ హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. దీంతో 30 ఏండ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానం టీడీపీ వశమైంది. 2016లో మినహా మిగిలిన ఐదుసార్లు వైఎస్ కుటుంబం నిలబెట్టిన అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యారు. 2016లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి.. అనతరం వైసీపీలో చేరారు. దీంతో బ్యాలెట్ పేపర్లలో సైకిల్ గుర్తు ఉండటంతో ఆ పార్టీకి 2500 ఓట్లు పోలయ్యాయి.
మరోవైపు ఒంటిమిట్ట జడ్పీస్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. అక్కడ టీడీపీ అభ్యర్థి మద్దు కృష్ణా రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ముగిసే సరికి ముద్దు కృష్ణారెడ్డికి 4632 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి ఇరుగంరెడ్డి సుబ్బారెడ్డికి 1211 ఓట్లు పోలయ్యాయి. మరో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగాల్సి ఉన్నది.