Nara Lokesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. తాను మీ బిడ్డనే అని చెప్పుకుంటున్న సీఎం జగన్పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆయన సొంత కంపెనీలు కళకళలాడితే.. రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని ఆరోపించారు.
ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీని తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం.. అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు లోకేశ్ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయాన్ని జగన్ రూ.370 కోట్లకు తాకట్టుపెట్టారని ఆరోపించారు.
అంతేగాక జగన్ ఖనిజ సంపద తనఖాతో రూ.7 వేల కోట్లు, మందు బాబులను తాకట్టుపెట్టి రూ.33 వేల కోట్లు అప్పులు తెచ్చారని లోకేశ్ విమర్శించారు. ఆయన పాలనలో ఇక మిగిలింది ఐదు కోట్ల మంది జనం మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదరగొడుతున్న జగన్ మాటల వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. రానున్న 2 నెలలు ఆయనతో జాగ్రత్తగా ఉండాలన్నారు.