Bachcula Arjunudu | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం హఠాన్మరణం పాలయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. గత జనవరి 28న గుండెపోటుతో కుప్పకూలడంతో చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ దవాఖానలో చేరారు. ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు. నాటి నుంచి ఐసీయూలోనే అర్జునుడు చికిత్స పొందుతున్నారు. రక్తపోటు అదుపులోకి రాకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని చెబుతున్నారు.
నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన బచ్చుల అర్జునుడును బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన గురువారం సాయంత్రం మరణించారు. ఆయన మృతదేహాన్ని ఆ ప్రైవేట్ దవాఖాన నుంచి మచిలీ పట్నంలో ఆయన సొంతింటికి తరలించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం వాసి అయిన బచ్చుల అర్జునుడు టీడీపీలో రాజకీయ అరంగ్రేటం చేశారు. 1995-2000 మధ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడిగా, 2000-05 మధ్య మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా సేవలందించారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2017లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి బచ్చుల అర్జునుడు ఎన్నికయ్యారు. ఈ నెల 29తో బచ్చుల అర్జునుడు పదవీ కాలం ముగియనున్నది. ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.