అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్బాబును ఈరోజు టీడీపీ నాయకులు పరామర్శించారు. విజయవాడలోని ఆయన నివాసానికి వెళ్లిన టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు తదితరులు ఆయనను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని వచ్చిన ఫిర్యాదుకు ఏపీ సీఐడీ అధికారులు నిన్న అశోక్బాబును అరెస్టు చేశారు. ఏపీ హైకోర్టులో అశోక్బాబు వేసిన మధ్యంతర బెయిల్ను నిరాకరించడంతో సీఐడీ అధికారులు గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు.
అక్కడి నుంచి శుక్రవారం రాత్రి విజయవాడలోని సీఐడీ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి ముందు అశోక్బాబును హాజరుపరిచారు. మొదట బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసిన అధికారులు.. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా 467 సెక్షన్ పెట్టారని న్యాయవాదులు వాదించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అరెస్ట్ చేశారని, ఇటీవలే అశోక్బాబు గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని.. అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినాని మాట్లాడుతూ .. అధికార వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. టీడీపీ నాయకులపై విధిస్తున్న కేసులకు ఎవరూ భయపడరని అన్నారు. ప్రభుత్వాన్ని శిక్షించేందుకు ప్రజలు సిద్ధంగా ఉందని తెలిపారు.