TDP | టీడీపీలో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. తిరువూరులో కేశినేని బ్రదర్స్ మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. దీంతో తిరువూరు టీడీపీ కార్యాలయం రణరంగంగా మారింది. ఇరు వర్గాలకు చెందిన అనుచరులు బాహాబాహీకి దిగారు. ఒకరిపై మరొకరు దాడికి దిగారు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ఎస్సైపైకి కూడా దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఎస్సై సతీశ్కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 7న తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం టీడీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరయ్యేందుకు కేశినేని నాని, కేశినేనిన చిన్ని ఇద్దరూ తిరువూరు వెళ్లారు. ముందుగా కేశినేని నాని వందమందితో బైక్ర్యాలీగా వచ్చారు. కానీ అక్కడ ఉన్న పోస్టర్లలో నాని ఫొటో చిన్నదిగా ఉండటంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. పోస్టర్లు చించి, కుర్చీలు విసిరేసి రభస చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జి దేవదత్పై కూడా నాని వర్గం గొడవకు దిగింది. ఈ గొడవ జరుగుతుండగానే తన అనుచరవర్గంతో కేశినేని చిన్ని ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. ఈ క్రమంలో వాళ్ల మధ్య ఘర్షణ మొదలైంది. రెండు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నంలో తిరువూరు ఎస్సై సతీశ్ తలకు బలమైన గాయమైంది. రక్తస్రావం ఎక్కువ కావడంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీంతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించకుండానే టీడీపీ ముఖ్య నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గొడవ అనంతరం కేశినేని నాని మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తనను ఒక వ్యక్తి చెప్పుతీసుకొని కొడతా అని ప్రెస్మీట్ పెట్టి మరీ తిట్టాడని గుర్తుచేశారు. క్యారెక్టర్ లెస్ ఫెలో అన్న ఆ మాటలపై పార్టీ నుంచి కనీసం ఎవరూ స్పందించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎంత అవమానించినా పార్టీ కోసం భరించా తప్ప.. ఏ రోజు పార్టీలో వర్గాలను ప్రోత్సహించలేదని అన్నారు. ఏడాదిన్నర నుంచి పార్టీలో కుంపటి నడుస్తోందని.. దానికి ఫుల్స్టాప్ పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘర్షణలు జరుగుతాయనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. ఇక కేశినేని చిన్ని కూడా ఈ గొడవపై స్పందించారు. తిరువూరు ప్రజలకు క్షమాపణలు అడిగిన ఆయన.. ఇలాంటి పునరావృతం కావని హామీ ఇచ్చారు. ఇవాళ జరిగిన గొడవను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు.