Vangaveeti Radha | టీడీపీ సీనియర్ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి ఉందని కుటుంబసభ్యులకు చెప్పడంతో.. హుటాహుటిన ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు వచ్చినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.
ప్రస్తుతం వంగవీటి రాధా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు.
వంగవీటి రాధాకు గుండెపోటు వచ్చిందన్న వార్త బయటకు రాగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ సమాచారం తెలుసుకుంటున్నారు. దీంతో విజయవాడలోని వంగవీటి రాధా ఇంటి వద్ద అభిమానుల తాకిడి పెరిగింది.