AP News | టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ను అరెస్టు చేశారు. జీఎస్టీ ఎగవేత, మనీలాండరింగ్ కేసులో కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్.. అవెక్సా కార్పొరేషన్ అనే కంపెనీని నడిపిస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించి జీఎస్టీ ఎగవేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడిపై జీఎస్టీ అధికారులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన మాచవరం పోలీసులు.. గురువారం నాడు అరెస్టు చేశారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు బదులు ఆయన కొడుకు శరత్ పోటీ చేయనున్నారు. ఇటీవల టీడీపీ-జనసేన ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో చిలకలూరిపేట నుంచి శరత్ టికెట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో శరత్ అరెస్టుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పోలీసులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు కావాలనే టీడీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు.
తన కొడుకు శరత్ అరెస్టుపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తన కుమారుడిపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఏ కంపెనీలోనూ డైరెక్టర్గా లేడని.. కనీసం షేర్ హోల్డర్గా కూడా లేడని స్పష్టం చేశారు. ఏ కంపెనీతో లావాదేవీలు లేని తన కుమారుడికి జీఎస్టీ ఎగవేతతో సంబంధమేంటని ప్రశ్నించారు. ఎన్నికల వేళ అక్కసుతో తమపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశాడు.