Bode Prasad | పెనమలూరు టికెట్ తనకు కేటాయించకపోవడంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై కొందరు కావాలనే అధిష్ఠానానికి అవాస్తవాలు చెబుతున్నారని బాధపడ్డారు. ప్రజల్లో ఉన్న తనపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.
తనపై వస్తున్న ఆరోపణలపై గురువారం నాడు బోడె ప్రసాద్ స్పందించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. పట్టాభిపై, పార్టీ కార్యాలయాలపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. కొడాలి నాని, వంశీతో సత్సంబంధాలు ఉండి ఉంటే ఆ విషయం ఎందుకు చెబుతానని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీతో సంబంధం లేదని తన పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు. భువనేశ్వరిపై వంశీ ఆరోపణలు చేసినప్పుడే సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేశానని చెప్పారు.
పార్టీ కోసం చంద్రబాబు చెప్పినట్టే పనిచేయడమే తనకు తెలుసని బోడె ప్రసాద్ తెలిపారు. పని చేయడం రాని వాళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సొంత మనుషులపై తనను మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ కోసం తనపై లేనిపోనివి అధిష్ఠానానికి చెబుతున్నారని మండిపడ్డారు.. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.
సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు వేరే నాయకుల పేర్లతో సర్వే చేయిస్తున్నారని బోడె ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. పెనమలూరులో తనకు టికెట్ ఇవ్వడం లేదని స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసి చెప్పారని.. అయినప్పటికీ ఇంకా టికెట్పై తనకు ఆశలు ఉన్నాయని చెప్పారు. తన గురించి వాస్తవాలను గుర్తించి అధిష్ఠానం అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.