వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై లోక్సభ స్పీకర్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. గోరంట్ల మాధవ్ చర్యలు సభ్య మహిళా సమాజాన్ని తలవంచుకునేలా ఉన్నందున ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఎంపీలుగా సభా మర్యాదలు పాటించడం తమ బాధ్యత అని, ఆ వీడియోను చూసి భవిష్యత్లో మరో ఎంపీ ఇలాంటి నీచానికి పాల్పడకుండా చూడాలని స్పీకర్ను అభ్యర్థించారు.
ఎంపీ మాధవ్పై చర్యలు ఉంటాయని చెప్పిన వైసీపీ అధిష్ఠానం ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందో వెల్లడించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీకి మహిళలంటే గౌరవం లేదని, ఎంపీపై చర్యలు తీసుకోనప్పుడు సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. మహిళా సంరక్షణ, గౌరవానికి సంబంధించిన అంశమైనందున పార్లమెంట్ మర్యాదలను కాపాడాలని లేఖ ద్వారా స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. పార్లమెంటు సభ్యులు ఎలా ప్రవర్తించినా చెల్లుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ఆయనపై చర్యలు తీసుకోనందున లోక్సభ స్పీకర్కు లేఖ రాసినట్లు చెప్పారు. లోక్సభ స్పీకర్పై తమకు నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు.
టీడీపీ ఎంపీ మాధవ్పై చర్యలు తీసుకుంటే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని, ఇదే భయంతో ఆయనపై చర్యలకు జంకుతున్నారని చెప్పారు. ఈ ఘటనను వ్యక్తిగత వ్యవహారంగా సజ్జల పేర్కొనడాన్ని తప్పుబట్టారు. మాధవ్పై చర్యలు తీసుకోకుండా మాట మార్చడంపై సజ్జల సమాధానం ఇవ్వాలని రామ్మోహన్ సూచించారు. గోరంట్లపై ఎట్టిపరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. కాగా, బీజేపీతో అంటకాగుతున్నామని వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ఇదంతా మాధవ్ కేసును పక్కదారి పట్టించేందుకే అన్నారు.