అమరావతి: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరం అన్నారు. మంత్రివర్గంలో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.
మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాను అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఫిట్నెస్కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే మంత్రి గారికి గుండెపోటు రావడం అత్యంత విచారకరం. విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి వచ్చినా వినయం, విధేయతలు ఆయన చిరునామా. ఐదుపదుల వయస్సులోనే హుందా గల రాజకీయవేత్తగా పేరుగాంచిన మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మనకి దూరం కావడం తీరని విషాదం. మేకపాటి గౌతమ్రెడ్డి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని లోకేష్ తెలిపారు.
సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డికి గుండెపోటు రావడంతో.. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే గౌతమ్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవలే కొవిడ్ బారిన పడ్డ గౌతమ్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమై ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనుమానిస్తున్నారు.