Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లోనే చంద్రబాబు ఆస్తులకు సంబంధించిన విషయాలు తెలిశాయి.
ఎన్నికల కమిషన్కు 2019లో నామినేషన్ సమయంలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తులు రూ.668 కోట్లు ఉన్నాయి. కాగా, ఇవాల్టి నామినేషన్ అఫిడవిట్లో ఆస్తి విలువను రూ.931 కోట్లుగా చూపించారు. ఇవన్నీ కూడా హెరిటేజ్ ఫుడ్స్, నిర్వాణ హోల్డింగ్స్ వంటి సంస్థల్లో పెట్టుబడులుగా ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటితో పాటు భువనేశ్వరి దగ్గర 3 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉన్నాయని వెల్లడించారు. స్థిరాస్తుల విషయానికొస్తే.. హైదరాబాద్, ఏపీ, తమిళనాడులో ఇళ్లు, పొలాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేసుల విషయానికొస్తే చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయి.