TDP | రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇది ప్రజలు కోరుకునన పొత్తు అని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన జనసేన-టీడీపీ భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. త్వరలోనే రాష్ట్రానికి నవోదయం రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ దొంగలపై పోరాడుతున్నామని.. భవిష్యత్తుకు నాంది పలకాల్సిన సమయం వచ్చిందని అన్నారు. వైసీపీని చిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. తమ మధ్య భేషజాలు లేవని.. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైనాట్ 175 కాదు.. వైనాట్ పులివెందుల అని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ ఐదేండ్ల పరిపాలన అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఛీకొడుతున్నారని అన్నారు. టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్ అని తెలిపారు. వైసీపీ చీటింగ్ టీమ్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 99 మంది అభ్యర్థులను ప్రకటించామని.. మిగతా సీట్లను కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 1.30 కోట్లమంది నుంచి ప్రజాభిప్రాయాల సేకరణ చేశామని.. ఆ తర్వాతే అభ్యర్థులను ప్రకటించామని స్పష్టం చేశారు. జగన్ ప్రకటించిన అభ్యర్థుల్లో స్మగ్లర్లు, రౌడీలు ఉన్నారని అన్నారు. మాఫియా నేతలు కావాలా? సేవ చేసే నేతలు కావాలా? తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.