కార్మికులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు అంటూ అభివర్ణించారు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో లక్షల మంది ఉపాధి పొందారని, నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిందని గుర్తు చేశారు.
అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో అల్లాడిపోతోందని విమర్శించారు. దీంతో కార్మిక లోకం తల్లడిల్లి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కార్మికులకు ప్రమాద బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి నేటిదని అన్నారు.
ఇప్పటికైనా కార్మిక లోకమంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్పూర్తితో పోరాడాలి. కార్మిక, శ్రామిక లోకానికి మేలు చేసే ఏ పోరాటానికైనా తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుందని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.