Roja Selvamani | ఇన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడ్డారు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుంటుందని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. అధికారులను అడ్డం పెట్టుకుని మరీ జగన్ బర్త్ డే వేడుకలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. తిరుపతి నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ఈవీంఎలను మేనేజ్ చేయడం వల్లే కూటమి నేతలు గెలిచారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంపై నెల రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని రోజా ఆరోపించారు. జగన్ అన్న నాయకత్వంలో ఆయనకు తోడుగా, అండగా ప్రజల పక్షాన పోరాటం చేద్దామని వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని అన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
తనపై కూటమి నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలపైనా రోజా స్పందించారు. తాను అవినీతి చేసినట్లు నిరూపించాలని కూటమి నాయకులకు సవాలు విసిరారు. ఫైల్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా.. నేను చేసిన తప్పు ఏంటో నిరూపించండని అన్నారు. వైసీపీ నాయకుల ఆస్తులను కూలదోచినా, వేధించినా.. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు.