అమరావతి : దివ్యాంగులను చట్ట సభల్లోకి పంపే బాధ్యతను తాను తీసుకుంటానని టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో దివ్యాంగుల పింఛన్లను రూ. 500ల నుంచి మూడు వేలకు పెంచామని గుర్తు చేశారు. దివ్యాంగులకు కార్పొరేషన్ను నెలకొల్పి లక్షల మందికి సహాయం చేశామని వివరించారు. రాబోయే రోజుల్లోనూ దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించేందుకు శతవిధాలా ప్రయత్నిసామని వెల్లడించారు.
ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలను వేధిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో తప్పుడు పనులకు పాల్పడుతున్న వారిపై తాము అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.