తిరుపతి : సీఎం జగన్ ఆకాంక్షలకు అనుగుణంగా సిమ్స్ను రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య సంస్థగా అభివృద్ధి చేస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్విమ్స్ ప్రాంగణంలోని పద్మావతి ఆడిటోరియంలో శుక్రవారం డాక్టర్స్ ఫర్ యూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.5కోట్ల వ్యవయంతో విరాళంగా అందించిన అత్యాధునిక వైద్య పరికరాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సిమ్స్కు తోడ్పాటునందించాలనే ఉద్దేశంతో టీటీడీలో విలీనం చేసినట్లు చెప్పారు. దాతల సహకారంతో అన్ని విభాగాల్లోనూ అధునాతన వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు తెలిపారు.
ఆసుపత్రికి అవసరమైన రూ.5కోట్ల విలువైన పరికరాలను విరాళంగా అందించిన డాక్టర్స్ ఫర్ యూ, హెచ్డీఎఫ్సీ సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. వీటిలో ఐసీయూలో వెంటిలేటర్లకు సహాయంగా ఉండేందుకు, కొవిడ్ వ్యాధిగ్రస్తులకు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు పది హై-ఎండ్ మల్టీపారా మానిటర్లు, 20 మిడ్ -రేంజ్ మల్టీపారా మానిటర్లు, 50 పల్స్ ఆక్సీ మీటర్లు ఉన్నాయన్నారు. అదేవిధంగా పది వెంటిలేటర్లు, ఒక నియోనెటల్ వెంటిలేటర్, 100 ఫాలర్ కోట్స్ ఆటోమేటిక్ విత్ మాట్రిసెస్, 25 డయాలసిస్ యంత్రాలు, రెండు అల్ట్రాసౌండ్ యంత్రాలు తదితర వైద్య పరికరాలు విరాళంగా అందించినట్టు పేర్కొన్నారు.
స్విమ్స్లో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి జరుగుతోందని, ఇందులో భాగంగా ఇక్కడనున్న 100 పడకల క్యాన్సర్ విభాగాన్ని 300 పడకలకు పెంచాలని సీఎం జగన్ ఆదేశించారని, దాతల సహకారంతో ఈ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీ వెంగమ్మ దాతలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, మేయర్ శిరీష, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్కుమార్, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, డాక్టర్స్ ఫర్ యు సంస్థ డైరెక్టర్ డాక్టర్ రజత్ జైన్, హెచ్డీఎఫ్సీ సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.