తిరుపతి : తిరుమల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భక్తులకు సాక్షాత్తు తాము శ్రీవారి ఆలయంలో ఉన్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా మ్యూజియం పనులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి (TTD EO) అధికారులకు ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో టీసీఎస్, మ్యాప్ సంస్థల అధికారులు, టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
మ్యూజియం ( Museum) లోని ఒకటో జోన్లో ఆలయ అనుభూతి కల్పించే పనులు, రెండో జోన్లో అన్నమయ్య గ్యాలరీ, ధ్యానమందిరం, స్వామివారి ఆభరణాలు, నాణేలు, పురాతన వస్తువులు హోలోగ్రామ్ టెక్నాలజీతో ప్రదర్శించే ఏర్పాటు చేయాలన్నారు. ఆభరణాల 3డి ఇమేజింగ్ ద్వారా భక్తులు తాము స్వామివారి నిజమైన ఆభరణాలు (Jewellery) చూస్తున్నామనే అనుభూతి కల్పించాలని సూచించారు.
మూడో జోన్లో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కళ్లకు కట్టినట్టు కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు సందర్శించే మ్యూజియం పనుల్లో నిమగ్నమైనవారు మనసు లగ్నం చేసి భక్తితో పని చేయాలని కోరారు. ఈ సమీక్షలో వేద వర్సిటీ వీసీ ఆచార్య రాణి సదాశివమూర్తి, ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్రెడ్డి, శ్రీవారి ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు, మ్యూజియం నిపుణులు ప్రొఫెసర్ కులకర్ణి, శివనాగిరెడ్డి,ఎవిఎస్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.