తిరుపతి: కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీ సర్వే సత్యనారాయణ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోపాటు రెండు రాష్ట్రాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన బర్త్డే కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించడం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మని సర్వే సత్యనారాయణ తెలిపారు. తాను లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం సోనియాను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమని తాము భావించాంమని, కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని అభిప్రాయపడ్డారు.
ఏపీకి వనరులు అంతగా లేవని, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారం ఆ రాష్ట్రానికి తగ్గిందని సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో పరిపాలన మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ నేతల వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనమైందని చెప్పారు. రెండు రాష్ట్రాలుగా విడిపోతే ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలు తమ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుమలలో ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని సర్వే చెప్పారు. టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టీటీడీలో మరింత మెరుగ్గా పాలన సాగుతున్నదన్నారు. ఇక్కడికి రావాలని ఎప్పుడూ అనిపిస్తుందని, అయితే స్వామి వారి అనుగ్రహం కలిగినప్పుడే తిరుమలను సందర్శించుకుంటున్నట్లు చెప్పారు.