ఢిల్లీ : జగన్ సర్కార్పై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. లాయర్లపై పెట్టే శ్రద్ధను పర్యావరణంపై చూపలేరా అని ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎంత మంది లాయర్లను మార్చారు, వారి కోసం ఎంత ఖర్చు చేశారో అన్నది కూడా తెలుసుకునేందుకు అవసరమైతే నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నమని కోర్టు వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరిగిన నష్టానికి ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహిందని ప్రశ్నించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నష్టంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. పర్యావరణ నష్టానికి రాష్ట్రం ఎందుకు బాధ్యత వహించదని ప్రశ్నించింది. లాయర్లకు ఫీజు చెల్లింపులో చూపుతున్న శ్రద్దను పర్యావరణం పరిరక్షణపై కనిపించడంలేదని వ్యాఖ్యానించింది. పర్యావరణ నష్టాన్ని ప్రభుత్వం ఎందుకు భరించదని నిలదీసింది. జరిగిన నష్టంపై ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ రూ.120 కోట్లు జరిమానా విధించింది. ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ రస్తోగి, జస్టిస్ రవికుమార్ ధర్మాసనం కీలకవ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో లాయర్లకు ఎంత చెల్లించారో తెలుసుకునేందుకు నోటీసు ఇస్తామన్న కోర్టు.. ఒక్క కేసును ఎందరు సీనియర్ లాయర్లను ఎంగేజ్ చేస్తారని ప్రశ్నించింది. ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్ తీర్పులపై దాఖలైన అన్ని అప్పీళ్లను ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతలపై ఇచ్చిన తీర్పులపై విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇప్పటికీ పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని పిటిషనర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలవరం వల్ల 50 వేల మందికి పైగా ముంపునకు గురయ్యారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన మూడు అప్పీళ్లను విచారించేందుకు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.