Viveka case trasnfer | వైఎస్ వివేకానంద హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసును తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు హతుడి కుటుంబసభ్యులు విచారణపై అసంతృప్తిగా ఉన్నందున కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రాధమిక హక్కులను పరిగణనలోకి తీసుకున్నామని, న్యాయం జరుగుతుందని కాదని, జరిగినట్లు కనిపించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హత్య కేసును ఇకపై తెలంగాణ సీబీఐ కోర్టు విచారిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
తన తండ్రి హత్య కేసు దర్యాప్తులో సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై తమకు నమ్మకం లేదని సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు. అందువల్ల ఈ కేసును అంధ్రప్రదేశ్లో కాకుండా మరెక్కడైనా విచారించాలని ఆమె తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు వివేకా హత్య కేసు విచారణకు స్థానిక యంత్రాంగం ఏమాత్రం సహకరించడం లేదని, ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని గతంలోనే సుప్రీంకోర్టులో సీబీఐ సైతం ఆఫిడవిట్ దాఖలు చేసింది.
వివేకా సతీమణి సౌభాగ్యమ్మపాటు ఆయన కుమార్తె సునీత.. కేసు విచారణపై అసంతృప్తితో ఉన్నందున వారి ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి పంపించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును స్వతంత్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు కొనసాగించాలని సూచించింది.