Kommineni Srinivasa Rao | సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేనికి ఎలంటి సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తెలిపింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, వాటిని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని హెచ్చరించింది. భవిష్యత్లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అసలేం జరిగిందంటే..
ఓ టీవీ ఛానల్లో నిర్వహించిన చర్చ సందర్భంగా అమరావతి రాజధానిపై జర్నలిస్టు కృష్ణంరాజు అసభ్య వ్యాఖ్యలు చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఏపీవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో రాజధాని రైతులు, మహిళలు, ఏపీ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కొమ్మినేనితో పాటు, జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని నివాసానికి వెళ్లి ఆయన్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.