హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో ఆయనకు చెందిన జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్తో పాటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చే సింది. అక్రమాస్తుల కేసులో తొలుత సీబీఐ కేసులు విచారించాలని, అప్పటివరకు ఈడీ రిజిస్టర్ చేసిన కేసుల విచారణను ఆపాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 5లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులకు నోటీసులిచ్చింది.
ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తొలుత మధ్యాహ్నం 2:30 గంటలకు హోంమంత్రి అమిత్షాతో సమావేశమైన జగన్ ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై దాదాపు 45 నిమిషాలకు పాటు చర్చించారు. అనంతరం 4:30 గంటలకు ప్రధానితో జగన్ భేటీ అయ్యారు. దాదాపు గంటా 20 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఆ తర్వాత ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఆయన సమావేశమయ్యారు.