తిరుమల : పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం ముగియడంతో సోమవారం ఉదయం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ( Suprabatha Seva) పునఃప్రారంభమైంది. గత ఏడాది డిసెంబరు 17న తెల్లవారుజామున నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం( Tiruppavai) కొనసాగింది. జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు.
జనవరి 16న ఎస్వీ గోశాల(SV Gosala) లో కనుమ గోపూజ
సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకుని జనవరి 16వ తేదీ మంగళవారం తిరుపతి(Tirupati) లోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు వేణుగానం, వేదపారాయణం, దాసాహిత్య ప్రాజెక్టు కళాకారులతో కోలాటం, అన్నమాచార్య ప్రాజెక్టు (Annamacharya Project) కళాకారులతో భక్తి సంకీర్తనల అలాపన, శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహణ ఉంటుందని వివరించారు. అనంతరం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి హరిదాసులు, బసవన్నల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.