అమరావతి : గుంటూరు శివారులోని అమరావతి రోడ్డులో మల్టీప్లెక్స్ నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు విరిగి ముగ్గురు మృతి చెందిన సంఘటనపై ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టిని సారించారు. ఈ ఘటనపై నగరపాలక సంస్థ చర్యలు ప్రారంభించింది. పట్టణ ప్రణాళికా విభాగం సూపర్వైజర్ సత్యనారాయణను సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు అతిక్రమించిన గుత్తేదారు సంస్థపైనా చర్యలు తీసుకోవాలని, సైట్ఇంజినీర్ , బిల్డర్పై కేసు నమోదు చేయాలని కమిషనర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. అమరావతి రోడ్డులో మల్టీప్లెక్స్ నిర్మాణ పనుల్లో భాగంగా సెల్లార్ను 20-30 అడుగుల లోతు వరకు తవ్వారు. బుధవారం ఉదయం రాడ్ బెండింగ్ పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. దాంతో అక్కడే పనుల్లో నిమగ్నమై ఉన్న కార్మికులు మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు అలర్ట్ అయి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మట్టిపెళ్లల కింద నలిగి చనిపోయిన ముగ్గురు కార్మికులు మృతదేహాలను బయటకు తీశారు. మృతులను మజ్నూ, అమీన్, నజీబ్గా గుర్తించారు. బాధిత కార్మికులు బిహార్, బెంగాల్ ప్రాంతం నుంచి ఇక్కడి వచ్చి దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. గతంలో కూడా గుంటూరు నగరంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో ఇలాగే మట్టిపెళ్లలు కూలిపడి ఏడుగురు చనిపోయారు. సంఘటనాస్థలాన్ని గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు, కమిషనర్ నిషాంత్ కుమార్ సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు.