Droupadi Murmu | కష్టాలను జయిస్తేనే విజయం వరిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సోమవారం శ్రీశైలం పుణ్య క్షేత్రంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత స్ఫూర్తి కేంద్రంలో గిరిజన మహిళలు, చిన్నారులతో సమావేశం అయ్యారు. సుమారు 10 నిమిషాలు స్థానిక గిరిజన సమస్యలపై నేరుగా వారితో చర్చించారు. `నేను జీవితంలో చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ విద్యాభ్యాసం చేశాను.. మా నాన్న కట్టె పుల్లలతో పొయ్యి వెలిగించి అన్నం వండి వడ్డించేవాడు.. అడుగడుగునా ఎదురవుతున్న కష్టాలను జయించడంవల్లే ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను` అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.
అంతకుముందు ద్రౌపది ముర్ముకు చిన్నారులు సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలికారు. ఆమె వారిని పేరుపేరునా పలకరిస్తూ వారి ఆశయ సాధనకు ఎలా కృషి చెయ్యాలో సూచించారు. భావి భరత పౌరులుగా తయారయ్యేందుకు ప్రతి చిన్నారి విద్యార్ధి దశ నుండే దేశభక్తి అలవర్చుకోవాలని అన్నారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణంలో నందిసర్కిల్ వద్ద కాన్వాయ్ నుండి దిగి అభిమానుల మధ్యకు వచ్చి అందరినీ పలకరించారు.