తిరుపతి : శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో టీటీడీ నిర్వహిస్తున్న కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఎంతో అదృష్టవంతులని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి (AV Dharma Reddy) పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఇతర కళాశాలల విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం స్టూడెంట్స్ సక్సెస్ మీట్ – అఛీవర్ అవార్డుల ప్రధానోత్సవంలో మాట్లాడారు.
అధ్యాపకులు విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో రాజీ పడవద్దని, అవసరమైన పక్షంలో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు కూడా అధ్యాపకుల పట్ల గౌరవభావంతో మెలిగి బాగా చదువుకోవాలని కోరారు. కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తీర్చేందుకు త్వరలో 120 మంది జూనియర్ లెక్చరర్లు (Junior Lecturers), డిగ్రీ లెక్చరర్ల నియామకానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
టీటీడీ (TTD) విద్యార్థులు అంకితభావం, ఏకాగ్రతతో బాగా చదువుకుని వారు కోరుకున్న ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈవో ఆకాంక్షించారు. టీటీడీ జెఈఓసదా భార్గవి, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తదితరులు పాల్గొన్నారు.