విజయనగరం: భోగాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య వివాదం ముదిరి పాకాన పడుతున్నది. తండ్రి ఎదుటే ప్రిన్సిపాల్ మందిలించడంతో విద్యార్థి యోగేంధర్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడి మృతికి ప్రిన్సిపాలే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించడంతో.. ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. యోగేంధర్రెడ్డి మృతి కారకులను శిక్షించాలంటూ విద్యార్థులు సోమవారం తరగతులు బహిష్కరించి బైఠాయించారు. పోలీసులు బాధిత కుటుంబాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి కాస్తా సద్దుమణిగింది.
భోగాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడెపువలస పంచాయతీ పరిధిలోని గాలిపేటకు చెందిన చుక్క రామసూరి, సుశీల కుమారుడు యోగేంధర్ రెడ్డి (14) భోగాపురం మోడల్ స్కూల్లో 9 వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం యోగేంధర్ రెడ్డి, మరో నలుగురు విద్యార్థులు క్లాస్ రూంలో సెల్ఫీలు తీసుకున్న విషయం తెలిసి ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్యారాణి వారిని పిలిచి మందలించారు. అనంతరం యోగేంధర్ రెడ్డి తండ్రి రామసూరిని పాఠశాలకు పిలిపించి సెల్ఫోన్ ఎందుకు ఇచ్చి చెడగొడుతున్నారంటూ ప్రశ్నించి పంపించి వేశారు.
అనంతరం యోగేంధర్ రెడ్డి పాఠశాల నుంచి కనిపించకుండా పోయాడు. శనివారం ఉదయం పాఠశాల సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యోగేంధర్ రెడ్డి కనిపించడంతో కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రిన్సిపాల్ సంధ్యారాణి వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆర్జేడీ జ్యోతికుమారి, డీఈఓ జయశ్రీ ఎదుట తండ్రి రామసూరి వాపోయారు. మళ్లీ ఇలా చేసావంటే టీసీ ఇచ్చి పంపిస్తానంటూ ప్రిన్సిపాల్ బెదిరించడం వల్లనే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. దాంతో డీఈఓ నివేదిక మేరకు ప్రిన్సిపాల్ సీహెచ్ సంధ్యారాణిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్జేడీ ప్రకటించారు. దీనిపై శాంతించని బాధితుడి తల్లిదండ్రులు.. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఆందోళనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి పరిస్థితి చేయిదాటకుండా చూశారు.