అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకులు చెబుతున్నట్లు కాలర్ ఎగరేసుకుని తిరగడం కాదు.. జనాలు కాలర్ పట్టే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యనించారు. విద్యాదివేన రాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించిన పూతలపట్టులో ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్పై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు.
విద్యార్థులపై కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై ప్రభుత్వం అసహనానికి లోనవుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ అసహనానికి అక్రమ అరెస్టులే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థికి క్షమాపణ చెప్పి అతడిపై కేసు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. వేపనపల్లి గ్రామస్థులు, టీడీపీ నేతలపైనా పెట్టిన కేసులు కూడా రద్దు చేయాలని తెలిపారు. స్థానిక పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.