అనంతపురం: జూనియర్లపై ర్యాగింగ్కు పాల్పడిన 20 మంది జేఎన్టీయూ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. గతంలో కొందరు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లుగా జేఎన్టీయూ అధికారులు తెలిపారు. అనంతరం దీనిపై విచారించేందుకు ఒక కమిటీని నియమించారు. బాధిత విద్యార్థులు, ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులను ప్రశ్నించిన ఈ కమిటీ.. తమ నివేదికను తయారు చేసి వర్సిటీ ఉన్నతాధికారులకు అందజేసింది.
ప్రిన్సిపాల్ పీ సుజాత, వైస్ ప్రిన్సిపాల్ బీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ బిల్డింగ్లో సమావేశమైన కాలేజ్ అకడమిక్ కమిటీ.. నివేదికను పరిశీలించింది. అనంతరం ర్యాగింగ్కు పాల్పడిన 20 మంది విద్యార్థులను సస్పెండ్ చేయాలన్న ప్రొఫెసర్ల కమిటీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ర్యాగింగ్కు పాల్పడిన వారిని మూడు వర్గాలుగా విభజించి.. మొదటి క్యాటగిరీలోని వారిని ఒక సెమిస్టర్, రెండో క్యాటగిరీలోని వారిని నాలుగు వారాలు, మూడో క్యాటగిరీలోని వారిని రెండు వారాల పాటు సస్పెండ్ చేశారు. శిక్షా కాలంలో విద్యార్థులను తరగతులకు, హాస్టళ్లకు అనుమతించబోమని స్పష్టం చేశారు.