విశాఖ: స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేసేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యుక్తులవుతున్నారు. స్టీల్ ప్లాంట్ విలువ లెక్క గట్టేందుకు కేంద్ర ఆర్థికశాఖ “రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్” బిడ్లను ఆహ్వానిస్తూ శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరోసారి రసవత్తరంగా మారింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతోపాటు వివిధ కార్మిక సంఘాలు గత కొన్నాళ్లుగా పోరాటాలు చేస్తున్నాయి. వీరి ఆందోళనలకు మద్ధతుగా వైసీపీ సహా వివిధ రాజకీయ పార్టీలు కూడా రోడ్డెక్కాయి. ఇలాఉండగా, కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుపోతున్నది. తాజాగా రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఉత్తర్వుల జారీని వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఈమేరకు స్టీల్ ప్లాంట్ యజమాన్యానికి అఖిలపక్ష కార్మిక నాయకులు సమ్మె నోటీసులు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని వారు కోరుతున్నారు.
కాగా, స్టీల్ ప్లాంట్కు సంబంధించిన ఆస్తులను లెక్కించేందుకు బిడ్లను ఆహ్వానిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆసక్తి ఉన్న అస్సెట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ ఏప్రిల్ నాలుగో తేదీలోగా బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 5న బిడ్లు తెరుస్తారు. ఎంపికైన సంస్థలు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్తోపాటు దాని అనుబంధ సంస్థల ఆస్తుల లెక్కించాల్సి ఉంటుంది.