తిరుపతి: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఆసుపత్రిలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పంచగవ్య
ఔషధాలతో చికిత్స అందించేలా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
అధికారులను ఆదేశించారు. గోసంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, టీటీడీ ఆస్తులకు జియో ఫెన్సింగ్ అంశాలపై ఈవో అధికారులతో సమీక్షించారు. ఆయుర్వేద ఆసుపత్రిలో ఓపి, 12 పడకలతో ఇన్ పేషెంట్ విభాగంప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.పంచగవ్య ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలు స్థిరీకరించడం కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
టీటీడీకి రోజువారీగా అవసరమయ్యే 3 వేల లీటర్ల పాలు, 60 కిలోల నెయ్యి సొంతంగా ఉత్పత్తి చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశవాళీ ఆవుల సేకరణకు అధికారుల బృందం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి గోశాలలో నెయ్యి తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి భవన నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ తయారయ్యే పాలు, పెరుగు తిరుమలలోని అన్నదానం కాంప్లెక్స్ కు పంపాలన్నారు.
రైతు సాధికార సంస్థ ద్వారా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఇప్పటిదాకా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రైతులకు 1300 కు పైగా ఆవులు, ఎద్దులు ఉచితంగా ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గోశాలల నిర్వాహకులకు గో ఆధారిత ఉత్పత్తుల తయారీ, గోసంరక్షణ అంశాలపై ఇస్కాన్ సహకారంతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని గో శాలలు స్వయం సంవృద్ధిగా తయారయ్యేందుకు అవసరమైన అంశాలు శిక్షణలో ఉండాలని ఈవో చెప్పారు.
దేశవ్యాప్తంగా టీటీడీ కి ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి ఆస్తికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఈవో ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన నీర్ ఇంటరాక్టివ్ సంస్థ ప్రతినిధులు జియో ఫెన్సింగ్ ఏర్పాటుపై డెమో చూపించారు.