తిరుపతి జిల్లా : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ దుర్మార్గానికి మూలకారకుడు ఇంటి దొంగే అని విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. ఓ ఉద్యోగితోపాటు ముగ్గురు వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్ కేసు నమోదు చేసి విచారిస్తున్నది. వీరిపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు 721 శ్రీవారి టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. ఇంకా ఎలాంటి మోసాలు చేశారో అన్నది తేల్చేందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.
తిరుమల, తిరుపతి దేవస్థానంలో ఇంటి దొంగ గుట్టు రట్టైంది. శ్రీవారి దర్శన టికెట్లు విక్రయిస్తున్న టీటీడీ సూపరింటెండెంట్పై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్నాళ్లుగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 721 వీఐపీ దర్శనం టికెట్లు, 25 ఏసీ గదులను అధిక ధరలకు విక్రయించినట్లు ఫిర్యాదు అందింది. దాంతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది విచారణ జరిపి టీటీడీ సూపరింటెండెంట్ మల్లికార్జున్, విజయవాడకు చెందిన వంశీ, మురళీకృష్ణతో పాటు మరో ఇద్దరు మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తిరుమల టూ టౌన్ పోలిసులు.. ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తున్నది. వీరిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తిస్తున్న మల్లికార్జున్ గత కొన్నేండ్లాగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది. శ్రీవారి వీఐపీ దర్శనం టికెట్ల బ్లాక్ విక్రయాలపై పోలీసు విచారణ జరుగుతుండటంతో మరికొందరు ఇంటిదొంగల బాగోతం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా టీటీడీ సిబ్బంది బ్లాక్ మార్కెట్లో స్వామి వారి దర్శనం టికెట్లను అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు. నకిలీ లేఖలతో మోసం చేసిన ఉదంతాలు కూడా బయటపడ్డాయి.