తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam) సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాల (VIP Break Darsan) ను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
ఏప్రిల్ 9న ఉగాది (Ugadi ) ఆస్థానం సందర్భంగా ఏప్రిల్ 2న మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని వివరించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారని వివరించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు.