తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15 నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్లో జారీ చేయనున్నారు. కొవిడ్ కారణంగా నిలిపివేసిన ఆఫ్లైన్ టికెట్ల జారీని ఎల్లుండి నుంచి పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. 16వ తేదీ దర్శనం కోసం 15న ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేస్తుంది.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. నిత్యం 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తున్నది. కరోనా కారణంగా 2020 మార్చి తర్వాత ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్లను నెలకొల్పారు.
ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రతిరోజు 25-30 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆఫ్లైన్లో 15 వేల టోకెన్లు జారీ చేస్తుండటంతో నిత్యం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలు దాటే అవకాశాలు ఉన్నాయి.