అమరావతి : తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. నిన్న స్వామివారిని 65,418 మంది భక్తులు దర్శనం చేసుకోగా 33,451 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపేణా హుండీ ఆదాయం రూ. 4.4 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా రేపు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా మార్చి 27న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.