తిరుమల : వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న వేంకటేశ్వరస్వామిని 66,763 మంది భక్తులు దర్శించుకోగా, 33,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
కాగా తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి ఆవిష్కరించారు. ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తులకు అందుబాటులో ఉంచుతున్న విషయం తెలిసిందే. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటపూర్ణప్రసాద్ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైఖానస పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు సులభంగా, అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రూ.75/- విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో శనివారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు.