తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు
ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్న అత్యధికంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 75,748 మంది స్వామివారిని దర్శించుకోగా 35,348 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమ ర్పించుకున్న కానుకల రూపేణా టీటీడీకి రూ. 3.89 కోట్లు ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. కాగా శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు.
ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురు చూస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయంతో పండించిన వంద టన్నుల శనగలు టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సమక్షంలో అధికారులు అందుకున్నారు. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో గోవిందుడికి నైవేద్యం సమర్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు దాదాపు 2500 మంది రైతులు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా, ప్రకృతి వ్యయసాయంతో పండించిన శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా సేకరించి, మార్క్ఫెడ్ ద్వారా, తమ మిల్లర్లలో టీటీడీ అవసరాలకు తగిన విధంగా రూపొందించి ఇస్తోందన్నారు.
ఈ ఏడాది గో ఆధారిత వ్యవసాయంతో పండించిన 2300 టన్నుల శనగలు అందుతాయన్నారు. ఇప్పటివరకు 1800 ఎద్దులు, వట్టిపోయిన ఆవులను రైతులకు అందించామని, శ్రీవారి ప్రసాదంగా భావించి వారు పూజలు చేసి పోషించుకుంటున్నారని వివరించారు.