తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన(Garuda Seva) సేవను టీటీడీ అధికారుల
సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో ( TTD EO) జె.శ్యామల రావు అన్నారు. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి బుధవారం రాంభగిచా రెస్ట్ హౌస్ వద్ద టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరుడ సేవలో ఆరోగ్యశాఖ (Health Department) సమర్దవంతంగా పని చేసిందని ప్రశంసించారు.
మరుగుదొడ్ల విషయం మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా మిగిలిన వాహన సేవలకు కూడా కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతమవుతాయని పేర్కొన్నా. మధ్యాహ్నం సమయంలో ఎండలు తీవ్రత అధికంగా ఉందని, వచ్చే బ్రహ్మోత్సవాలకు గ్యాలరీల్లోని భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా షెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అడిషనల్ ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్యాలరీల వద్ద మరిన్ని శాశ్వత మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లో మరో వందేళ్లకు సరిపడా మాస్టర్ ప్లాన్(Master Plan రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మాడ వీధుల్లో భక్తులు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై గందరగోళం ఉందని దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గరుడ వాహన సేవలో క్యాటరింగ్ విభాగం చాలా బాగా పని చేసిందని అభినందించారు.