తిరుమల : తిరుమల భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త తెలిపింది. ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల (Darsan Ticket Quota) కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రేపు( గురువారం )ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని సూచించింది. లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. వర్చువల్ సేవా టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక వసంతోత్సవానికి సంబంధించిన సేవా టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని అన్నారు.
ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నామని చెప్పారు.
24న ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా రిలీజ్
ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Darsan Quota) రూ.300 టికెట్ల కోటాను జనవరి 24న ఉదయం 10 గంటలకు, తిరుమల(Tirumala), తిరుపతి(Tirupati)లో వసతి గదుల బుకింగ్ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని వివరించారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తామని వెల్లడించారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.