తిరుపతి: శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు నిర్వహించనున్నారు.
అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతోపాటు వర్చువల్ విధానం కూడా కొనసాగించనున్నారు. వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు. వారికి దర్శనం కల్పించడంతోపాటు ప్రసాదాలు అందిస్తారు.
అడ్వాన్స్ బుకింగ్లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1 నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. కరోనా పరిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొనసాగుతుందని టీటీడీ స్పష్టం చేసింది.