శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. బుధవారం ఏడోరోజు పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం ఆలయంలో చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు రుద్రహోమం, చండీహోమం జరిపించినట్లు కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన గజ వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను డప్పుచప్పుళ్ల నడమ క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. చెంచు కళాకారుల జానపదాలు, రాజభటుల కోలాటాలు, కళాకారుల విన్యాసాల నడుమ సందడితో ఊరేగింపు కొనసాగింది.
గజం అంటే ఐశ్వర్యానికి, అంగబలానికి, ఆదిపత్యానికి ప్రతీక. జయజయ ద్వానాల నడుమ జగన్మాత భ్రమరాంబికతో కలిసి శ్రీశైలేషుడు గజవాహనాన్ని అధిరోహించి దర్శనమిచ్చాడు. గజవాహనంపై స్వామి అమ్మవార్లను దర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, కష్టాల్లో స్వామి అండగా ఉంటానని భక్తుల విశ్వాసం. గ్రామోత్సవంలో ఈఓ కేఎస్ రామారావుతోపాటు ఈఈ బాలమురళీకృష్ణ, డీఈ నర్సింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, ఏఈఓలు కృష్ణారెడ్డి, డి.మల్లయ్య, హరిదాసు, సంపాదకుడు అనిల్ కుమార్, పర్యవేక్షకులు శ్రీహరి, హిమబిందు, సూపరింటెండెంట్ అయ్యన్న, ఉమేశ్ పట్వారీ , రవికుమార్లు పాల్గొన్నారు.
జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఒకేచోట వెలసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీశైలం అని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామశివాచార్య మహాస్వామి అన్నారు. బుధవారం ఉదయం క్షేత్రానికి వచ్చిన ఆయనకు కన్నడ భక్తులు ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. అనంతరం క్షేత్ర పురవీధుల్లో పల్లకిపై ఊరేగిస్తూ భజనలు చేశారు. సాయంత్రం ఆలయ దర్శనానికి వచ్చిన పీఠాధిపతికి ఈఓ కేఎస్ రామారావుతోపాటు అర్చకులు వేదపండితులు బిల్వ మాలధారణ చేసి ఘనంగా స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాలతోపాటు పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన మల్లన్న దంపతులను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి రెండు లక్షలకుపైగా భక్తులు వస్తారని అంచనా. కాలినడకతో వచ్చే యాత్రికులకు మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ఫుట్పాత్లు, రోడ్లు, డివైడర్ల వెంట నిద్రపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైనంత సిబ్బంది లేకపోడంతో వసతుల కల్పనకు ఇబ్బందిగా మారిందని ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.