Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం శ్రీభ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. తర్వాత యాగశాలలో శ్రీచండీశ్వర స్వామికి అర్చక వేద పండితులు ప్రత్యేక పూజాధికాలుచేశారు. లోక కల్యాణం కోసం జపాలు చేశారు. నిత్య హోమ బలిహరణలు పూర్తి చేసి రుద్ర హోమం, జయాది హోమం జరిపించారు. అమ్మవారి ఆలయ యాగశాలలో చండీ హోమం జరిపారు. యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించడంతో యాగం పూర్తయ్యింది.పూర్ణహుతి తర్వాత వసంతోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు (అద్యాపక) వసంతాన్ని (పసుపు, సున్నం, సుగంధ ద్రవ్యాలు కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
వసంతోత్సవం తర్వాత చండీశ్వర స్వామి వారికి మల్లికా గుండం వద్ద అవభృథం, తర్వాత త్రిశూల స్నానం కార్యక్రమాలు నిర్వహించారు. వసంతోత్సవం ముగియగానే చండీశ్వర స్వామి వారిని ఆలయ ప్రాకార ప్రదక్షిణతో మల్లికాగుండం వద్దకు పల్లకీలో తోడ్కోని వచ్చారు. తదుపరి చండీశ్వర స్వామికి అవభృథం జరిపించారు. ఈ అవభృథంలో రుద్రధ్యాయ మంత్రాలతో చండీశ్వర స్వామి వారికి శుద్ధ జలం, పంచామృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళోదకం తదితరాలతో స్పపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తదుపరి మల్లికాగుండంలో చండీశ్వర స్వామి వారికి త్రిశూల స్నాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండీశ్వర స్వామి వారికి మల్లికాగుండంలో పుణ్య స్నానం చేయించారు. త్రిశూల స్నానం చేసే సమయంలో మల్లికాగుండ జలాన్ని తలపై ప్రోక్షించుకోవడం వల్ల పాపాలన్నీ నశించి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. ఈ కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్ లవన్న, ధర్మకర్తల మండలి సభ్యుడు మఠం వీరూపాక్షయ్యస్వామి, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉగాది ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీభ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మ వార్లకు అశ్వ వాహనసేవ, అమ్మవారికి భ్రమరాంబాదేవి నిజాలంకరణ కార్యక్రమాలు చేశారు. వాహన సేవల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అటుపై ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. అశ్వ వాహనాధీశులైన శ్రీస్వామి అమ్మవార్లను దర్శించడంతో సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని భ్రమరాంబికా దేవి నిజాలంకరణ స్వరూపంలో అలంకరించారు. అష్ట భుజాలను కలిగిన శ్రీ అమ్మవారు.. శూలం, బాకు, గధ, ఖడ్గం, విల్లు, డాలు, పరిగ తదితర ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిచ్చింది. అమ్మవారి నిజాలంకరణ దర్శనంతో సమస్యలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు.