Srisailam : శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో పుర వీధులన్నీ కిటకిటలాడాయి. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. వరుసగా వారాంతపు సెలవులు కలిసిరావడంతో కుటుంబసమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకొన్నారు. స్వామిఅమ్మవార్ల ఉచిత దర్శనానికి 3 గంటలు, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుండగా సుమారు 60 వేల మందికి పైగా ఉభయ దేవాలయాల్లో దర్శానాలు చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కార్తీకమాసం కావడంతో శని, ఆది, సోమవారాల్లో క్షేత్రానికి వచ్చే భక్తులు కుటుంబ సభ్యులతో బస చేసేందుకు కావలసిన సదుపాయాలు కొంతమేరకు మాత్రమే ఉన్నట్లు ఈవో లవన్న తెలిపారు. స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం గమ్మస్థానాలకు తిరుగు ప్రయాణం అవ్వాలని కోరారు. క్షేత్ర పరిధిలో ఉండే నిత్యాన్నదాన సత్రాలలో కూడా అద్దె గదులు, డార్మెటరీలు లభించక పోవడంతో ఉద్యానవనాలు, ఫుట్పాతులపై నిద్రించడం కష్టంగా ఉందని భక్తులు ఆవేదన చెందారు. ప్రత్యేక పర్వదినాల్లో సామాన్య భక్తులు కూడ బస చేసేందుకు వీలుగా ప్రత్యేక వసతి సదుపాయాలను కల్పించాలని యాత్రికులు కోరుతున్నారు.
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సులు 24 గంటలూ నడిపిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. యాత్రికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఈవో లవన్న కోరుతున్నారు.