Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలిరావడంతో సోమవారం క్షేత్ర వచ్చే దారులన్నీ కిక్కిరిసి పోయాయి. బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో పురవీధులు కికిటలాడాయి. భక్తులు తెల్లవారుజామున పుణ్య స్నానాలు చేసుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలకు బారులు దీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా మూడుగంటల సమయంపడుతున్న అలంకార దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు.
ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందినవారికి, కాలినడకన శ్రీశైలం చేరుకునే యాత్రికులతోపాటు ఇరుముడి శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ల్ ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంవల్ల ఆలయం తెరిచినప్పటి నుండి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ అల్పాహారం అందిస్తూ ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహా ప్రసాదం అందుబాటులో ఉంచారు. అలాగే కాలినడక శివస్వాములకు భక్తులకు మార్గమధ్యలో అన్నదానాలు మంచినీటిని అందిస్తున్న స్వచ్చంద సంస్థలకు దేవస్ధానం వారు వసతులు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా క్షేత్ర పరిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకురులు కూచిపూడి భరతనాట్యం హరికథా సంగీత కార్యక్రమాలు ఉదయం నుండి రాత్రి వరకు భ్రామరీ కళావేదికతోపాటు శివదీక్షా శిబిరం, పుష్కరిణి వద్ద ప్రదర్శనలు ఇస్తున్నట్లు పీఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు.